కొత్తగూడెం, ఆగస్టు 30: సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కార్మిక సంఘాల మధ్య ప్రచార పోరు రోజురోజుకూ వేడెక్కుతోంది. ప్రధాన కార్మిక సంఘాలు పరస్పరం విమర్శలు, ఆరోపణలు, కౌంటర్ ఎటాక్స్తో కార్మికులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2023 ఎన్నికల్లో ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా విజయం సాధించిన నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఆధిపత్యం సాధించేందుకు అన్ని సంఘాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తాజాగా ఏఐటీయూసీ చేపట్టిన సమ్మె, యాజమాన్యంతో జరిగిన చర్చలు, 23 ప్రధాన డిమాండ్లపై అంగీకారం వంటి అంశాలను ఆ సంఘం తన విజయాలుగా ప్రచారం చేస్తుండగా.. ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్టీయూసీతో పాటు టీబీజీకేఎస్ తీవ్ర స్థాయిలో కౌంటర్ ప్రచారాన్ని ప్రారంభించాయి. “గతంలో అమలైన వాటినే కొత్త విజయాలుగా చెబుతున్నారు” ఏఐటీయూసీ ప్రకటిస్తున్న 23 డిమాండ్లలో అనేక అంశాలు గతంలోనే అమలులోకి వచ్చినవని, మరికొన్ని ఇప్పటికే యాజమాన్యం అంగీకరించినవేనని ఐఎన్టీయూసీ ఆరోపిస్తోంది. గతంలో అమలైనవి, చట్టపరంగా కార్మికులకు ఉన్న హక్కులు, యాజమాన్యం ఎప్పటి నుంచో నిర్వహిస్తున్న ప్రక్రియలను ఇప్పుడు తమ పోరాట ఫలితాలుగా చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తోంది. “ఏఐటీయూసీ కొత్తగా సాధించిన అంశాలేమిటో కార్మికులకు స్పష్టంగా చెప్పాలి” అంటూ ఐఎన్టీయూసీ ప్రచారం చేస్తోంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో చెప్పాలని కూడా ప్రశ్నిస్తోంది. సర్వీసులో సహజ మరణం పొందిన కార్మికుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం సాధించామని ఏఐటీయూసీ చెబుతున్నప్పటికీ, గతంలోనే రూ.1 కోటి ఇన్సూరెన్స్కు సంబంధించి బ్యాంకర్లతో ఒప్పందం జరిగిందని ఐఎన్టీయూసీ పేర్కొంటోంది. ప్రతి నెలా మెడికల్ బోర్డులు నిర్వహించడం ఇప్పటికే ప్రారంభమైందని, గత రెండు నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని చెబుతోంది. వాస్తవ లాభాలను ప్రకటించడం కూడా సింగరేణిలో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అని పేర్కొంటోంది. ట్రాన్స్ఫర్లలో మూడు సంవత్సరాల నిబంధనను గతంలోనే తొలగించి ఏడాదికి మార్చారని, మారుపేర్ల సమస్యపై ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసి నెల రోజులకు పైగా గడిచిందని అంటోంది. హైదరాబాద్లో సింగరేణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు అంశం కూడా గతంలోనే అంగీకరించినదేనని, దిగిపోయిన కార్మికులకు వారం రోజుల చికిత్సా సౌకర్యం ప్రస్తుతం కూడా అమలులో ఉందని ఐఎన్టీయూసీ పేర్కొంటోంది. అలాగే సింగరేణి విద్యాసంస్థల్లో సీబీఎస్ఈ సిలబస్ అమలులోనే ఉందని, భద్రతా సామగ్రిని సకాలంలో అందించడం యాజమాన్యం బాధ్యతగా ఎప్పటి నుంచో కొనసాగుతోందని చెబుతోంది. డిస్మిస్ అయిన కార్మికుల పెండింగ్ కేసులు, డిపెండెంట్ ఉద్యోగాల పెండింగ్ కేసుల విషయంలో ఇప్పటికీ స్పష్టమైన పరిష్కారం లేదని విమర్శిస్తోంది. మైనింగ్ స్టాఫ్కు సూటబుల్ ఉద్యోగాల విషయంలో గతంలోనే ఒప్పందం జరిగినప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని పేర్కొంటోంది. కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్ఐ వైద్యం చట్టపరమైన హక్కేనని, ఖాళీ పోస్టుల భర్తీ, క్యాడర్ స్కీమ్ సమస్యల పరిష్కారం వంటి అంశాలు కూడా యాజమాన్యం ఎప్పటి నుంచో చేపడుతున్న ప్రక్రియలేనని ఐఎన్టీయూసీ అంటోంది. మెడికల్ ఫి