ఖానాపూర్ టౌన్, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామంలో ఆదివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. గ్రామంలోని ప్రతి ఇంటిని పోలీసులు నిశితంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని 60 బైక్లు, 8 ఆటోలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు. డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసమే కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, గంజాయి వంటి మాదకద్రవ్యాల విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఖానాపూర్ సీఐ సత్యనారాయణ, ఎస్సైలు రాహుల్, సాయికుమార్, హనుమాన్లు, సర్పంచ్ ప్రశాంత్రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు