కుభీర్, ఆగస్టు 31: నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సిరిపెల్లి గ్రామానికి చెందిన ఆశ కార్యకర్త కాంతాబాయి(41) అనారోగ్యంతో సోమవారం ఉదయం మృతి చెందారు. కుబీర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సిరిపెల్లిలో కొంత కాలంగా ఆశ వర్కర్ గా సేవలందిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యం బారిన పడిన ఆమె పేదరిక పరిస్థితుల వల్ల విధులను నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలు అందిస్తూ వస్తున్నారు. కొద్ధి రోజుల క్రితం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతోకుటుంబ సభ్యులు నిజామాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానాలో చేర్పించి చికిత్స అందిస్తున్న క్రమంలో ఆరోగ్య పరిస్థితి ఎంత మాత్రం మెరుగు పడకపోవడంతో వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు ఆమెను స్వగ్రామమైన సిర్పెల్లికి తీసుకువచ్చారు. దీంతో ఆమె సోమవారం ఉదయం మృతి చెందారు. గ్రామానికి చెందిన ఆశ కార్యకర్త కాంతబాయి మృతి గ్రామంలో విషాదాన్ని నింపింది. అంత్యక్రియలకు కుబీర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పలువురు ఏఎన్ఎంలు, మండలంలోని ఆయా గ్రామాల ఆశ కార్యకర్తలు హాజరై నివాళులర్పించారు. ఆమెకు కూతురు, కొడుకు ఉన్నారు. ఆశ కార్యకర్త మృతితో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిందని, ప్రభుత్వం వెంటనే మృతి చెందిన ఆశ వర్కర్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. కుభీర్ పీ హెచ్ సీ వైద్యులు విజేష్ రాథోడ్, మాజీ సర్పంచ్ పండిత్ జాదవ్, గోపీచంద్ మండల ఆశా వర్కర్లు ఆమె మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు