భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ: భీమ్గల్ పట్టణంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ప్రభుత్వం అందజేసిన పాఠశాల బ్యాగులను శనివారం పంపిణీ చేశారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడంతో పాటు విద్యార్థినులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో భాగంగా బ్యాగులను అందజేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ అనురాధ తెలిపారు. కస్తూరిబా విద్యాలయంలో చదువుతున్న 340 మంది విద్యార్థినులకు ప్రభుత్వం ద్వారా వచ్చిన బ్యాగులను అందజేశారు. బ్యాగులు అందుకోవడంతో విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి అవసరమైన సామగ్రిని ప్రభుత్వం అందించడం అభినందనీయమని పాఠశాల సిబ్బంది పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అనురాధ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థినులు సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యార్థినుల విద్యా ప్రగతితో పాటు సమగ్ర అభివృద్ధికి పాఠశాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోదావరి, వాసవి, మాధవి, స్వప్న, విజయలక్ష్మి, భారతి, పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు