ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్న టీడీపీ నేతలు కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ: ప్రజల సంక్షేమం, ప్రాంతాల అభివృద్ధి రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని కర్నూలు డీసీఎంఎస్ చైర్మన్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై. నాగేశ్వరావు యాదవ్ అన్నారు. ‘ఇంటింటికి తెలుగుదేశం–2026’ కార్యక్రమంలో భాగంగా పాణ్యం నియోజకవర్గంలోని 31వ వార్డులో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి పర్యటన నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 31వ వార్డులోని బూత్ నంబర్లు 151, 152, 139, 141, 142 పరిధిలో టీడీపీ నాయకులు పర్యటించి ప్రజలను నేరుగా కలుసుకున్నారు. వారి సమస్యలు, అవసరాలు, స్థానికంగా ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడమే ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నాగేశ్వరావు యాదవ్ తెలిపారు. ప్రజలు చెప్పిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటూనే, ప్రాంతీయ అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు ఇన్చార్జ్ శైలజ యాదవ్, యూనిట్ ఇన్చార్జ్ ఏ. మల్లికార్జున, క్లస్టర్ కో-కన్వీనర్ పుల్లయ్య గౌడ్, టీడీపీ నాయకులు రఘుగిరిధర్ యాదవ్, రేణుక, యేసు, పాండు, విజయ, లాజ్ బాషా తదితరులు పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇంటింటి పర్యటనలో భాగస్వామ్యమయ్యారు