చౌటుప్పల్, ఆంధ్రప్రభ: గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి క్రీడారంగంలో తనదైన ప్రతిభతో రాణిస్తున్న దబ్బేటి రాములు గౌడ్ మరో అరుదైన ఘనత సాధించారు. హైదరాబాద్లో ఎన్ఎండీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుల్ మారథాన్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. 50 ఏళ్ల వయస్సులోనూ యువతకు పోటీగా నిలిచిన రాములు గౌడ్ 42 కిలోమీటర్ల మారథాన్ను 4 గంటల 47 నిమిషాల్లో పూర్తి చేసి బంగారు పతకం సాధించారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటి విజయం సాధించిన ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాములు గౌడ్ మాట్లాడుతూ, ఆరోగ్య పరిరక్షణకు వయసుతో సంబంధం లేదన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి ప్రతిరోజూ క్రీడలు, వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలని సూచించారు. గ్రామీణ యువతకు ఆదర్శంగా నిలిచిన రాములు గౌడ్ విజయంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు