ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సజావుగా పరీక్షల నిర్వహణ అభ్యర్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించిన యంత్రాంగం అధికారుల సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, ఆంధ్రప్రభ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి. విజయవాడ ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సివిల్స్ మెయిన్స్ పరీక్షలు జరిగాయి. యూపీఎస్సీ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడంతో పరీక్షలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు, భద్రత తదితర ఏర్పాట్లు అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల ముఖ ఆధారిత గుర్తింపు ప్రక్రియను కూడా నిబంధనల ప్రకారం నిర్వహించారు. పరీక్షా కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయడంతో పాటు, అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ప్రజా రవాణా శాఖ ఆధ్వర్యంలో అవసరమైన బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచారు. రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్యం, పోస్టల్, ప్రజా రవాణా, విద్యుత్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించారు. ఆదివారం చివరిరోజు కూడా జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం యూపీఎస్సీ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ పరీక్షా విధుల్లో భాగస్వాములైన అధికారులు, సిబ్బంది, సహకరించిన అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు