చండూరు, ఆగస్టు 31 : ప్రభుత్వం సూచించిన వరి విత్తనాలను రైతులు సాగుచేసి ప్రభుత్వం అందజేస్తున్న రూ.500 బోనస్ రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏఈఓ పవన్ అన్నారు. చండూరు మండలంలోని బోడంగిపర్తి గ్రామంలో ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్న వరి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం రూ.500 బోనస్ అందిస్తున్న అంశంపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బంగారిగడ్డ క్లస్టర్ ఏఈఓ పవన్ మాట్లాడుతూ.. ఈ వాన కాలంలో బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సోనా), హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం-1638 (కూనారం సన్నలు), డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి), కేఎన్ఎం-7715 వంటి ఏడు సన్న రకాలు సాగు చేసిన రైతులు సెప్టెంబర్ 10వ తేదీ లోపు ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. డీలర్ల వద్ద ప్రభుత్వం సూచించిన పై 7 రకాల సన్న వరి విత్తనాలు కొనుగోలు చేసి ఉంటే సంబంధిత డీలర్ ని సంప్రదించి తమ పేరును వెంటనే నమోదు చేయించుకోవాలన్నారు. అలాగే సొంత విత్తనాలు, ఇతర మార్గాల ద్వారా సన్న రకం విత్తనాలు సేకరించి సాగు చేసిన రైతులు సంబంధిత ఏఈఓ దగ్గర నమోదు చేయించుకుని ప్రభుత్వం అందిస్తున్న రూ.500 బోనస్ ను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు బొమ్మల శంకర్, కట్కూరు సైదులు, సరికొండ మారయ్య, కట్కూరి సత్తయ్య, కట్కూరి లింగస్వామి, బొల్లెద్దు గిరిబాబు, చేపూరి యాదగిరి, కడారి నరసింహ, కారింగు శంకరయ్య పాల్గొన్నారు