Penamaluru: పెనమలూరు వంతెనపై మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి వంతెనపై నుంచి బందరు కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతురాలు పెనమలూరుకు చెందిన అనూషగా స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాలువలో గల్లంతైన యువతి మృతదేహం కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఘటన స్థలాన్ని ఉయ్యూరు ఆర్డీఓ సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. యువతి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టాయి. కాలువలో నీటి ప్రవాహం, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గాలింపు కొనసాగుతోంది. మృతదేహం లభించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, వారం రోజుల వ్యవధిలో ఇదే పెనమలూరు వంతెనపై నుంచి ముగ్గురు వ్యక్తులు దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకోవడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. వరుస ఘటనల నేపథ్యంలో వంతెన వద్ద భద్రతా చర్యలు చేపట్టి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు