ఆడుకుంటూ వెళ్లిన రెండేళ్ల బాలుడికి విషాదాంతం చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రమాదవశాత్తు గోబర్ గ్యాస్ కోసం తీసిన గుంతలో పడి బీహార్కు చెందిన రెండేళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన చిట్యాల మండలంలో చోటుచేసుకుంది. చిట్యాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్కు చెందిన అజయ్ పండిట్ కుమారుడు ఆర్యన్ కుమార్ (2) రాఖీ పండుగ సందర్భంగా ఏపూర్ గ్రామంలోని డీఈసీ కంపెనీలో పనిచేస్తున్న తన మామయ్య ఇంటికి వచ్చాడు. ఈ నెల 26న కుటుంబ సభ్యులతో కలిసి ఏపూర్ గ్రామానికి వచ్చిన బాలుడు శుక్రవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో క్వార్టర్స్ పక్కన ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం అయినా బాలుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. బాలుడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. అనంతరం కంపెనీలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. అందులో బాలుడు కంపెనీ ప్రాంగణంలోకి వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ గోబర్ గ్యాస్ కోసం తీసిన గుంతలో ప్రమాదవశాత్తు బాలుడు పడిపోయినట్లు గుర్తించారు. గుంతలో పడిపోవడంతో ఊపిరాడక బాలుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాలుడి తండ్రి అజయ్ పండిట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చిట్యాల ఎస్ఐ బి. వెంకటరెడ్డి తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు