మాజీ ఎమ్మెల్యే డా. గాదరి కిషోర్ కుమార్ మోత్కూర్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా. గాదరి కిషోర్ కుమార్ ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం దాచారం గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో భూముల వ్యవహారంలో ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలిగిస్తోందని, 22ఏ నిషేధిత జాబితా పేరుతో భారీగా భూములను చేర్చారని విమర్శించారు. రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులు గడిచినా ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సెప్టెంబర్ 2న తుంగతుర్తిలో నియోజకవర్గ స్థాయి నిరసన ధర్నా, సెప్టెంబర్ 3న మిర్యాలగూడలో వ్యవసాయం, కృష్ణా జలాల అంశాలపై నిర్వహించే సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని చెప్పారు. రైతులకు సాగునీరు అందించడంలో జిల్లా మంత్రులు విఫలమయ్యారని డా. కిషోర్ కుమార్ విమర్శించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, వివిధ మండలాల పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు