రాజోలు: జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 2న అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించుకోవాలని, అయితే ఆయన ఆశయాలు, స్థాయికి తగ్గట్టుగా సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాజోలు సీఐ సురేష్ బాబు ఆద్వర్యంలో పోలీసులు విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానాన్ని ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా కాకుండా సేవా స్ఫూర్తిని చాటేలా చూపించాలని సూచించారు. బైక్ సైలెన్సర్లు తొలగించి అధిక శబ్దాలతో హంగామా చేయడం, మద్యం లేదా గంజాయి సేవించి ఇతరులకు ఇబ్బందులు కలిగించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని కోరారు. “మన నాయకుడిపై ఉన్న అభిమానం.. మన ప్రవర్తనలో కనిపించాలి. పవన్ కళ్యాణ్ స్థాయికి తగ్గట్టుగా క్రమశిక్షణతో వేడుకలు జరుపుకుందాం” అని జనసేన ముఖ్య నేతలు అభిమానులకు పిలుపునిచ్చారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సేవ, సంయమనం, స్ఫూర్తికి ప్రతీకగా నిలిపి రాజోలు నియోజకవర్గ అభిమానులు ఆదర్శంగా నిలవాలని నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో రాజోలు ఎస్సై మల్లికార్జున రెడ్డి, సఖినేటిపల్లి ఎస్సై దుర్గా శ్రీనివాస్,జనసేన ముఖ్య నేతలు సూరిశెట్టి శ్రీనివాస్, గుండాబత్తుల తాతాజీ, కోళ్ల బాబి,వాసంశెట్టి పృధ్వీ, పూసంపూడి మనోహర్, యాతం పెద్దిరాజు, చింతా సురేష్ తదితరులు పాల్గొన్నారు