సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఛేదించిన నాలుగో పట్టణ పోలీసులు కర్నూలు, ఆంధ్రప్రభ : ఇంటికి తాళాలు పగలగొట్టి బంగారు, వెండి ఆభరణాలు అపహరించిన కేసును నాలుగో పట్టణ పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితుల కదలికలపై నిఘా పెట్టి నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 25 గ్రాముల బంగారు ఆభరణాలు, 320 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు చోరీకి ఉపయోగించిన స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. జూలై 6న నాలుగో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని ఆదిత్యనగర్, ఉల్చాల రోడ్డులో నివాసముంటున్న జయంతి మహేశ్వర్రెడ్డి ఇంట్లో తాళాలు పగలగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న సుమారు 25 గ్రాముల బంగారు నగలు, 320 గ్రాముల వెండి ఆభరణాలను అపహరించారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు అందుబాటులో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ స్కూటీని గుర్తించి దాని ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు చివరకు వారి ఆచూకీ గుర్తించారు. నాలుగో పట్టణ సీఐ విక్రమ్సింహ ఆధ్వర్యంలో ఎస్సై చంద్రశేఖర్రెడ్డి, కానిస్టేబుళ్లు సుబ్బారాయుడు, మురళి, జీనస్, ఈశ్వర్, గోవింద్ ప్రత్యేకంగా నిఘా పెట్టారు. సమ్మర్ స్టోరేజ్ సమీపంలోని పొలాల్లో దాక్కుని ఉన్న నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో తాడిపత్రి పట్టణానికి చెందిన ఎరుకలి గంగాప్రసాద్, ఎరుకలి శివప్రసాద్, కర్నూలులోని ఇందిరాగాంధీనగర్కు చెందిన కామ్లే కార్తిక్, పామిడికి చెందిన ఎరుకలి రామాంజనేయులు ఉన్నారు. వారి వద్ద నుంచి రెండు బంగారు చైన్లు, చిన్నపిల్లల ఉంగరాలు కలిపి సుమారు 2.5 తులాల బంగారు ఆభరణాలు, 32 తులాల వెండి ఆభరణాలతో పాటు చోరీకి ఉపయోగించిన స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా అనుమానిత వాహనాన్ని గుర్తించి, దాని ద్వారా నిందితుల వరకు చేరుకోవడంలో నాలుగో పట్టణ పోలీసుల దర్యాప్తు కీలకంగా మారింది