తొర్రూరు, ఆంధ్రప్రభ: బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఐక్యంగా ఉద్యమించి రాజ్యాధికారం సాధించాలని కూరపాటి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కూరపాటి రమేష్ పిలుపునిచ్చారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల ఐక్య సమావేశం బీసీ దళపతి డాక్టర్ పరికిపండ్ల అశోక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ సమాజంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఐక్యంగా ఉంటే భవిష్యత్తులో రాజకీయంగా ఎదగడంతో పాటు తమ వాటాను సాధించుకునే అవకాశం ఉంటుందన్నారు. విద్య, వైద్యం, సంక్షేమ రంగాల్లో అసమానతలు తొలగి బడుగు బలహీన వర్గాలకు సమాన అవకాశాలు లభించాలన్నారు. బీసీ వర్గాల్లో రాజకీయ చైతన్యం పెంచేందుకు ఐక్య ఉద్యమాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చందా మల్లయ్య, డాక్టర్ పరికిపండ్ల అశోక్, దామార ఉపేందర్, వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు