ఫిక్స్డ్ డిపాజిట్(FD)లో డబ్బు దాచుకునే పెట్టుబడిదారులకు రిజర్వ్ బ్యాంక్ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. దీంతో బ్యాంకింగ్ నిబంధనలకు సంబంధించి ఎఫ్డీ ఇన్వెస్టర్లు తప్పనిసరిగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆర్బీఐ కొత్తగా సవరించిన బ్యాంక్ డిపాజిట్ల ఫ్రేమ్వర్క్ సెప్టెంబర్ 1 నుంచి కాకుండా.. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. కొత్త రూల్స్ ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి అన్ని బ్యాంకులు రూ.3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంక్ పనిచేసే ప్రతి రోజూ తమ అధికారిక వెబ్సైట్లలో తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి. అంతేకాకుండా ఒక నిర్దిష్ట డిపాజిట్ మొత్తానికి అన్ని బ్రాంచ్లలో ఒకే రకమైన స్థిర వడ్డీ రేటును అందించాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంటుంది. అయితే బ్యాంకులు వివిధ బల్క్-డిపాజిట్ స్లాబ్ల వారీగా వేర్వేరు వడ్డీ రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటును మాత్రం కొనసాగించవచ్చు. ఈ కొత్త రూల్స్ కేవలం బల్క్ డిపాజిట్లకే వర్తిస్తాయని, సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లపై దీని ప్రభావం ఏమాత్రం ఉండదని రిజర్వు బ్యాంక్ స్పష్టం చేసింది. కాబట్టి చిన్న పెట్టుబడిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు