పెనమలూరులో టిడ్కో గృహాల పరిచయ కార్యక్రమం.. ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పెనమలూరు, ఆంధ్రప్రభ: పెనమలూరు నియోజకవర్గంలో టిడ్కో గృహాల పరిచయ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై టిడ్కో గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు టిడ్కో గృహాలు ఆశాకిరణంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన, సురక్షితమైన నివాసం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గృహ నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గృహాలను పరిశీలించిన లబ్ధిదారులు తమ సొంతింటి కల నెరవేరుతున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణం, మౌలిక వసతులు, పరిసరాల అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేశారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని, టిడ్కో గృహాల పరిసరాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కూడా ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. సొంతింటి తలుపులు తెరుచుకుంటుండటంతో లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది