తెలంగాణ ప్రభుత్వం.. అధికార పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి కొండా సురేఖ పైన చర్యలు ఖాయమనే ప్రచారం వేళ కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పటికే పార్టీ క్రమశిక్షణా సంఘం కొండా సురేఖ తో పాటుగా చిన్నా రెడ్డిపైన చర్యలకు సిఫారసు చేసింది. ఢిల్లీ వెళ్తున్న సీఎం రేవంత్.. పీసీసీ చీఫ్ ఈ వ్యవహారాల పైన పార్టీ అధినాయకత్వంతో చర్చించనున్నారు. అయితే.. కొండా సురేఖ పైన పార్టీ హైకమాండ్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్దం అవుతోంది. పార్టీలో చర్చగా మారిన కొండా సురేఖ వ్యవహారం పైన పార్టీ నాయకత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో సమాచారం సేకరించింది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ లోగానే కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారం పైన నిర్ణయం ప్రకటించేందుకు పార్టీ సిద్దం అవుతోంది. అందులో భాగంగా సీఎం రేవంత్... టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీకి వెళ్తు న్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకోనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ కీలక నాయకత్వం ఢిల్లీలోనే అందుబాటులో ఉండనున్న నేపథ్యంలో ఈ రెండు రోజుల్లోనే ఈ మొత్తం వ్యవహారం పైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వీరి పైన కఠిన చర్యలు తీసుకోని పక్షంలో సీఎం రేవంత్రెడ్డిని, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచినట్లే అవుతుందని రేవంత్ మద్దతు దారులు అధిష్ఠానంకు వివరించినట్లు తెలుస్తోంది. సురేఖ సహా ముగ్గురు ఔట్: రాములమ్మ, మహేష్ గౌడ్ ఇన్- పీసీసీ చీఫ్, స్పీకర్ మార్పు..!? చర్యలు ఖాయం.. మంత్రివర్గ విస్తరణ దీంతో, కొండా సురేఖ, చిన్నారెడ్డిపై కఠినంగానే చర్యలు తీసుకుని.. క్రమశిక్షణ విషయంలో మిగిలిన నాయకులకు స్పష్టమైన సంకేతాన్నివ్వాలన్న యోచనలో అధిష్ఠానం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించడం కాకుండా.. మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందిగా కోరుతారని సమాచారం. అదే విధంగా చిన్నారెడ్డిని సైతం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని సూచిస్తారని తెలుస్తోంది. ఇక.. మరోవైపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టి కొత్తవారికి అవకాశం ఇచ్చే పేరుతో కొండా సురేఖను తప్పిస్తారన్న ప్రచారం కూడా ఉంది. అయితే.. క్రమశిక్షణ విషయంలో అధిష్ఠానం కఠినంగా ఉందని సంకేతాలు ఇచ్చేందుకు రాజీనామా కోరే అవకాశాలే ఉన్నాయని పార్టీ ముఖ్య నేతల సమాచారం. అయితే, ఇదే సమయంలో ఇతర అంశాలు.. లెక్కలు పరిగణలోకి తీసుకుంటున్న పార్టీ నాయకత్వం వివాదం లేకుండా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పేరుతో పక్కన పెట్టే విధంగా నిర్ణయం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో.. రానున్న రెండు రోజుల్లో పార్టీ హైకమాండ్ నిర్ణయం ఖాయమని చెబుతున్న వేళ.. ఎలాంటి డెసిషన్ వస్తుందనే ఉత్కంఠగా మారుతోంది