పదోతరగతిలో మార్కులు ఇవ్వనందున మెరిట్ గుర్తింపులో తికమక సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కండక్టర్ ఖాళీల భర్తీకి ప్రక్రియ చేపట్టాల్సి ఉంది... దీనికి అర్హత పదో తరగతి... మెరిట్ ఆధారంగా ఎంపిక చేయటం ఆర్టీసీలో ఆనవాయితీ. ఇక్కడే ఇప్పుడు తిరకాసు నెలకొంది. దశాబ్దంన్నరగా పదో తరగతిలో మార్కులకు బదులు గ్రేడింగ్ పద్ధతిని అనుసరిస్తున్నారు. అభ్యర్థుల సర్టిఫికెట్లలో గ్రేడింగ్ మాత్రమే ఉంటుంది. దరఖాస్తుదారుల్లో కొందరు మార్కుల విధానం ఉన్నప్పటి పదో తరగతి అభ్యర్థులు, కొందరు గ్రేడింగ్ మార్చిన తర్వాత టెన్త్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉన్నారు. అలాంటప్పుడు మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసేదెలా అని అర్టీసీ అధికారులు కొన్ని నెలలుగా సతమతమవుతున్నారు. 1500 పోస్టులకు అనుమతి ఆర్టీసీలో సుమారు 2 వేల మంది కండక్టర్ల అవసరం ఉన్నా, భర్తీ ప్రక్రియ మొదలు కావటం లేదు. రెండు నెలల క్రితమే 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. గతంలో ఆర్టీసీనే సొంతంగా భర్తీ నిర్వహించేది. కాన్నీ దాన్ని మారుస్తూ నియామక సంస్థల ద్వారా (టీజీఎస్పీఎస్సీ లాంటి సంస్థలు) భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, కండక్టర్ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష అవసరం లేదన్న నిర్ణయంతో, ఆర్టీసీనే సొంతంగా ఆ పోస్టులు భర్తీ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో ఇక జాప్యం లేకుండా భర్తీ ప్రక్రియ జరుగుతుందని అంతా భావించారు. కానీ, ఇక్కడే తిరకాసు నెలకొని అసలు ప్రక్రియ మొదలే కాలేదు. పదోతరగతి మార్కులే అర్హతగా నియామకాలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో, అభ్యర్థుల్లో కొందరు పాత విధానంతో సర్టిఫికెట్లు, కొందరు కొత్త విధానం గ్రేడింగ్ సర్టిఫికెట్లు సమర్పిస్తే, మెరిట్ను ఎలా గుర్తించాలన్న సందేహంతో అధికారులు తలలు పట్టుకున్నారు. ఒకే గ్రేడ్లో వందల మంది విద్యార్థులు ఉంటారు. వారిలో ఏ బేస్మీద మెరిట్ను గుర్తించాలో తేల్చుకోలేకపోతున్నారు. దీంతో గ్రేడ్లను మార్కుల శాతాల్లోకి ఎలా మార్చాలో, మార్కులతో కూడిన జాబితాలను, గ్రేడ్లతో కూడిన జాబితాలను ఎలా మెరిట్తో బేరీజు వేసుకోవాలో తెలపాల్సిందిగా విద్యాశాఖను కోరుతూ ఆర్టీసీ లేఖ రాసింది. చేతులెత్తేసిన విద్యాశాఖ ప్రస్తుతం ఏ ప్రభుత్వ, కార్పొరేషన్ పరిధిలో పదో తరగతి మార్కుల జాబితా ఆధారంగా నియామకాలు జరగటం లేదని, గ్రేడ్ల విధానం మొదలయ్యాక ఇప్పటి వరకు ఈ తరహా పరిస్థితి తమకు ఎప్పుడూ ఎదురు కాలేదని, దీన్ని మీరే తేల్చుకోవాలంటూ విద్యాశాఖ అధికారులు మౌఖికంగా సమాధానం ఇచ్చారు. లిఖితపూర్వకంగా సమాధానం పంపాలని ఆర్టీసీ కోరినా, ఇప్పటి వరకు పంపలేదని తెలిసింది. ఇక, సెలెక్షన్ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం ఓ సందేహం అడిగింది. ఎంపిక కమిటీలో ఎవరెవరు ఉంటారంటూ ప్రభుత్వం ప్రశ్నించింది. రీజినల్ స్థాయిలో జరిగే ప్రక్రియ కాబట్టి రీజినల్ మేనేజర్ సహా మరికొందరు అధికారులుంటారని ఆర్టీసీ తెలిపింది. దీని తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు. అటు పదో తరగరతి మార్కుల వ్యవహారం, ఇటు ప్రభుత్వం నుంచి తుది ఆదేశం రాకపోవటం వెరసి జాప్యం జరుగుతూ వస్తోంది. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.