Kaizer News

4న టీటీడీ భారీ కార్యక్రమం- భక్తులకు ఛాన్స్: స్వయంగ

4న టీటీడీ భారీ కార్యక్రమం- భక్తులకు ఛాన్స్: స్వయంగా విజ్ఞప్తి

· State - Telangana · telugu.oneindia.com

తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. శనివారం 71,803 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. వారిలో 28,685 మంది తలనీలాలు సమర్పించారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.04 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 10 నుండి 12 గంటల సమయం పట్టింది. 4.25 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 2.54 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సెప్టెంబర్ 4వ తేదీన కృష్ణాష్టమి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోశాలలో గోకులాష్టమి వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. గోపూజతో పాటు వేదపఠనం, భజనలు, కోలాటాలు, సంకీర్తనలు, హరికథ తదితర కార్యక్రమాలను టీటీడీ నిర్వహించనుందా రోజున. మామిడి తోరణాలు, పూలమాలలు, ప్రత్యేక అలంకరణలతో గోకులాన్ని తలపించేలా తీర్చిదిద్దుతున్నారు టీటీడీ అధికారులు. గోపాలకృష్ణుని జన్మదినమైన గోకులాష్టమికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సనాతన ధర్మంలో గోమాతను పవిత్రంగా భావించడం ఆనవాయితీ. గోవును సాక్షాత్ లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. విశేష సందర్భాల్లో పూజలు చేస్తుంటారు. హిందూధర్మంలో గోపూజలకూ విశిష్ట స్థానం కల్పించారు. ఈ సంప్రదాయాన్ని భక్తుల్లో మరింతగా పెంపొందించే ఉద్దేశంతో టీటీడీ ప్రతి ఏటా గోకులాష్టమి వేడుకలను నిర్వహిస్తూ వస్తోంది. గోకులాష్టమి రోజున భక్తులు గోవులకు బెల్లం, బియ్యం, పశుగ్రాసం అందించి గోసేవలో భాగస్వాములు అయ్యే అవకాశాన్ని కల్పించింది టీటీడీ. గోమాతకు గ్రాసదానం పుణ్యప్రదం. భక్తులు ఈ పవిత్ర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. కృష్ణాష్టమి రోజున గోశాలలో టీటీడీ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించనుంది. తెల్లవారు జామున 5 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారికి అభిషేకం, 6 గంటలకు వేణుగానం, 7:30 గంటలకు వేదపఠనం నిర్వహిస్తారు. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు కళాకారుల భజనలు, కోలాటాలతో గోశాల గోకులాన్ని తలపించనుంది. ఉదయం 8 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీహరి సంకీర్తనలు ఆలపిస్తారక్కడ. ఉదయం 10 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, హారతి నిర్వహిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అదే రోజు సాయంత్రం టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని దివ్య లీలలు, గోసేవ మహత్యాన్ని వివరించేలా హరికథ నిర్వహించనున్నారు

Original source: telugu.oneindia.com
Read more on Kaizer News