Peddapalli: పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల పోలీసులు అత్యంత గౌరవప్రదంగా, మానవతా దృక్పథంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ లో భాగంగా పెద్దపల్లి ఏసీపి గజ్జి కృష్ణ, సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు లు పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ముందుగా వార్షిక తనిఖీకి వచ్చిన ఏసీపీ గజ్జి కృష్ణకు ఎస్సై గట్ల సుధాకర్ పుష్పగుచ్చం తో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా స్టేషన్లోని రిసెప్షన్ రిజిస్టర్, ఎంట్రీ రిజిస్టర్లు, పలు రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులన్నింటినీ ఎప్పటికప్పుడు క్రమబద్ధంగా, పక్కాగా నిర్వహించాలని సిబ్బందికి ఆదేశించారు. అనంతరం పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.ఈ సందర్బంగా ఏసీపీ గజ్జి కృష్ణ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడిపట్ల పోలీసులు గౌరవంగా ప్రవర్తించాలన్నారు. బాధితుల సమస్యలను ఓపికగా విని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు బాధ్యతాయుతంగా కృషి చేయాలి అన్నారు. ప్రజా రక్షణే ధ్యేయంగా పనిచేస్తూ, ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచాలి అన్నారు.విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, గ్రామాల్లో ప్రజలతో నిరంతరం సంబంధాలు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. నేరాల నివారణే ధ్యేయంగా రాత్రి, పగలు తేడా లేకుండా రెగ్యులర్ పెట్రోలింగ్, గస్తీ తీవ్రతరం చేయాలన్నారు. మండలంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదుదారుల సమస్యలపై తక్షణమే స్పందించి న్యాయం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావ్ ఎస్సై గట్ల సుధాకర్ ఏఎస్ఐ నీలిమ పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు