Kaizer News

టీవీలో కూతురు పెళ్లి..ఇంట్లో అక్షింతల సందడి!

టీవీలో కూతురు పెళ్లి..ఇంట్లో అక్షింతల సందడి!

· State - Telangana · prabhanews.com

అమెరికాలో ప్రేమ వివాహం.. గ్రామంలో అతిథులకు పెళ్లి విందు ఏర్పాటు హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ: ఒకప్పుడు పెళ్లి అంటే.. వారం ముందు నుంచే ఏ చీర కొనాలి.. ఏ నగలు వేసుకోవాలి.. విందులో ఏ రకం వంటకాలు చేసి వియ్యంకుల వారికి వడ్డించాలి. అమ్మాయి కాళ్ల పట్టీల నుంచి కళ్లకు పెట్టుకునే కాటుక వరకు ఏది వేసుకోవాలి.. ఎలా కొనాలి అనే హడావుడి ఉండేది. ఆకాశం అంత పందిరి.. బంధువులు, అతిథిలతో ఇల్లు నిండిపోయి సందడి.. సందడిగా ఉండేది.. కానీ ఇప్పుడు సాంకేతికత కాలంలో పెళ్లికి అర్థం మారిపోయింది. ఆన్ లైన్ లో పెళ్లి చేసుకుంటుంటే.. ఆఫ్ లైన్ లో తల్లిదండ్రులు అక్షింతలు వేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి పెళ్లే సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం వేపలసింగారం గ్రామంలో జరిగింది. అమెరికాలో జరుగుతున్న తమ ఏకైక కుమార్తె వివాహాన్ని తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో వీక్షిస్తూ అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. వేపలసింగారం గ్రామానికి చెందిన జయరాజు, జ్యోతి దంపతుల ఏకైక కుమార్తె హిమబిందు అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. అక్కడే పరిచయమైన ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రోహిత్ కుమార్‌ను ప్రేమించిన హిమబిందు, అతడిని వివాహం చేసుకుంది. శుక్రవారం రాత్రి అమెరికాలో జరిగిన వీరి వివాహాన్ని తల్లిదండ్రులు స్వగ్రామం నుంచే ఆన్‌లైన్‌లో వీక్షించారు. కుమార్తె పెళ్లికి ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయినా, ఆన్‌లైన్ ద్వారా వివాహ వేడుకను చూసిన జయరాజు, జ్యోతి దంపతులు అక్షింతలు చల్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం గ్రామంలోని బంధుమిత్రులు, అతిథుల కోసం పెళ్లి విందును ఏర్పాటు చేశారు. ఈ ఘటన స్థానికంగా ఆసక్తికరంగా మారింది

Original source: prabhanews.com
Read more on Kaizer News