జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పట్నాపూర్ సిద్దేశ్వర సంస్థానంలో ఆదివారం శ్రీ శ్రీ శ్రీ సద్గురు పులాజీ బాబా 102వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్, ఆసిఫాబాద్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు పటేల్, ఆసిఫాబాద్ కలెక్టర్ కె. హరిత, మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యేలు, విశ్రాంత కమిషనర్ సంభాజీ సర్కుండే, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ప్రముఖులు, భక్తులు పులాజీ బాబా సమాధి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పులాజీ బాబాకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిద్దేశ్వర సంస్థాన్ కమిటీ అధ్యక్షుడు ఇంగ్లే కేశవ్ దాదా, కమిటీ సభ్యులు బాబా మందిర అభివృద్ధి, భక్తులకు అవసరమైన వసతుల కల్పనపై ముఖ్య అతిథులకు వినతిపత్రాలు సమర్పించారు. వేడుకలకు హాజరైన భక్తులను కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా భక్తులు పులాజీ బాబా గత 50 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా అందిస్తున్న సేవలను కొనియాడారు. బాబా చూపిన మార్గాన్ని భక్తులు విస్మరించకుండా ఆయన బోధనల ప్రకారం నడుచుకుంటూ ఆశయాలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కందారే లక్ష్మి బాలాజీ, ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీర శ్యామ్ నాయక్, బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్, తుడుం దెబ్బ జాతీయ అధ్యక్షుడు కోట్నాక్ విజయ్కుమార్, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథరావు, ఆదిలాబాద్ గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య, ప్రముఖులు, అధికారులు, సర్పంచులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు