Jangaon: జనగామ జిల్లా చిల్పూరు మండలం గార్లగడ్డ తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మల్లన్నగండి రిజర్వాయర్ ను సందర్శించేందుకు వెళ్లి ఇటీవల ఇద్దరు యువకులు నీటిలో మునిగి మృత్యువాత పడటం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ నాయకులు, హం సాత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మహమ్మద్ యాకుబ్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మల్లన్నగండికి ప్రజల తాకిడి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షణ ఏర్పాటు చేసి, సంబంధిత అధికారులు అక్కడ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మల్లన్నగండిలో ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలను డేంజర్ జోన్లుగా ప్రకటించి, అక్కడ భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు హెచ్చరికలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు. దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు మల్లన్నగండిని సందర్శించేందుకు వస్తున్నప్పటికీ, వారి భద్రతకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తోందని అన్నారు. 2026 ఆగస్టు 21న దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం గ్రామానికి చెందిన మహమ్మద్ నజీర్ మల్లన్నగండిని సందర్శించేందుకు వెళ్లి నీటిలో మునిగి మృతి చెందడం తీవ్ర విషాదకరమని అన్నారు. అదేవిధంగా 2026 ఆగస్టు 29న బసన్నపేటకు చెందిన భాస్కర్ కూడా ఇదే ప్రాంతంలో నీటిలో మునిగి మృత్యువాత పడటం మరింత బాధాకరమని మహమ్మద్ యాకుబ్ పాషా అన్నారు. మొదటి ఘటన జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై, ప్రమాదకర ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టి ఉంటే రెండో ఘటనను నివారించే అవకాశం ఉండేదని ఆయన పేర్కొన్నారు. వరుసగా రెండు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి, మల్లన్నగండిలో తగిన భద్రతా చర్యలు చేపట్టాలని ఈ సంఘటనలపై ప్రభుత్వం ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి చనిపోయిన నజీర్ మరియు భాస్కర్ కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షలఎక్స్ గ్రేషియా ఇచ్చి వారి కుటుంబాలకు ఒక ఆర్థిక భరోసా కల్పించాలని వారు డిమాండ్ చేశారు