Cheepurupalli: చీపురుపల్లి నియోజకవర్గ యువతకు మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు అన్నారు. చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ఆదేశాల మేరకు, కిమిడి రామ్ మల్లిక్ నాయుడు ఆధ్వర్యంలో చీపురుపల్లిలోని శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలలో APSSDC (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. గ్రామీణ యువత ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, స్థానికంగానే ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. కేవలం విద్యార్హతలు మాత్రమే కాకుండా, పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక, వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవడం చాలా అవసరమని సూచించారు. ఈ మేళాలో పలు ప్రముఖ ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థుల విద్యార్హతలు, నైపుణ్యాలను పరిశీలించి నియామక ప్రక్రియ చేపట్టారు. చీపురుపల్లి నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల నుండి వందలాది మంది యువత హాజరై తమ అర్హతలకు తగ్గ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నిర్వహించే నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని, చీపురుపల్లి నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఎమ్మెల్యే కళా వెంకటరావు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. భవిష్యత్లో ఇలాంటి జాబ్ మేళాలను మరిన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో APSSDC అధికారులు, వివిధ కంపెనీల ప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కళాశాల సిబ్బంది, ఉద్యోగార్థులు పాల్గొన్నారు