కుటుంబ సమేతంగా స్వర్ణ ఆభరణం సమర్పించనున్న చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి విశేష స్వర్ణ ఆభరణాన్ని కానుకగా సమర్పించనున్నారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) కుటుంబ సమేతంగా బంగారు జడను అమ్మవారికి భక్తిశ్రద్ధలతో అందజేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 9.30 గంటలకు దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించనున్నారు. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి మహామండపం ఎదురుగా ఉన్న కళావేదిక ప్రాంగణం నుంచి మంగళవాయిద్యాల నడుమ స్వర్ణ ఆభరణాన్ని ఊరేగింపుగా ప్రధాన ఆలయానికి తీసుకెళ్లనున్నారు. అనంతరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ సమక్షంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి బంగారు జడను శాస్త్రోక్తంగా సమర్పించనున్నారు. అమ్మవారి అలంకారానికి స్వర్ణ ఆభరణాన్ని సమర్పించే ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య కార్యక్రమం నిర్వహించనున్నారు