Vizag | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : విశాఖ జిల్లాలో శనివారం తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. పెందుర్తి మండలం చింతల అగ్రహారంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. మల్లా ప్రవీణ్ కుమార్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు మృతిచెందినట్లు సమాచారం. కుటుంబం బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం అందుతున్నప్పటికీ, ఘటనకు దారితీసిన కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబం తీసుకున్న ఈ విషాదకర నిర్ణయానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవల శ్రీశైలంలోనూ ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు మృతిచెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా విశాఖలో జరిగిన ఘటనతో మరోసారి విషాదం నెలకొంది