Mydukuru: రోడ్డుపై వివాహ వేడుకల బాణాసంచా పేలుళ్ల కారణంగా ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. మైదుకూరు నుంచి ఆళ్లగడ్డ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, దువ్వూరు మండల కేంద్రంలో ప్రయాణికులను ఎక్కించుకుని చాగలమర్రి వైపు బయలుదేరింది. దువ్వూరు సమీపంలోని దేవాన్సీ, సివివి కల్యాణ మండపాల వద్దకు చేరుకోగానే, వివాహ వేడుకల్లో భాగంగా కొందరు రోడ్డుపై ఒక్కసారిగా టపాసులు కాల్చారు. ఆ భారీ శబ్దాలకు భయాందోళనకు గురైన ఓ ద్విచక్ర వాహనదారుడు బైపాస్ రోడ్డు నుంచి వస్తూ ఒక్కసారిగా వాహనాన్ని కుడివైపునకు మళ్లించాడు. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్, ఆ బైక్ను ఢీకొనకుండా ఉండేందుకు సమయస్ఫూర్తితో బస్సును ఎడమవైపునకు తిప్పాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే తవ్వి ఉన్న డ్రైనేజీ కాలువలోకి బస్సు దిగి ఒకవైపునకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు కిందపడి స్వల్ప గాయాలతో బయటపడగా, బస్సులోని ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. కల్యాణ మండపాల వద్ద పార్కింగ్ సదుపాయాలు లేకపోవడం, రోడ్లను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేస్తుండటంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై బాణాసంచా కాల్చే వారిపై, అక్రమ ఆక్రమణలపై అధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు