ఏళ్ల వయసులోనే అర్ధసెంచరీ చేసి చరిత్ర.. 42 బంతుల్లోనే అర్ధశతకం.. 57 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన యువ సంచలనం బ్యాట్తో మెరుపులు.. కెప్టెన్గా అదుర్స్.. బౌలింగ్లోనూ సత్తా చాటుతున్న వైభవ్ బెంగళూరు, ఆంధ్రప్రభ: భారత దేశవాళీ క్రికెట్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి రికార్డుల పుస్తకంలోకి ఎక్కాడు. దులీప్ ట్రోఫీ 2026 సెమీఫైనల్లో సెంట్రల్ జోన్తో జరుగుతున్న మ్యాచ్లో ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్.. కేవలం 42 బంతుల్లోనే అర్ధశతకం సాధించి చరిత్ర సృష్టించాడు. 15 ఏళ్ల 175 రోజుల వయసులో ఈ ఘనత అందుకున్న అతడు.. దులీప్ ట్రోఫీ చరిత్రలో అర్ధశతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ క్రమంలో 57 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న లక్ష్మణ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో జరుగుతున్న సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున ఓపెనర్గా వచ్చిన వైభవ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అతడు కేవలం 42 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. భారీ సిక్సర్తో యాభై పరుగుల మార్క్ను అందుకోవడం విశేషం. అనంతరం కూడా దూకుడు కొనసాగించిన వైభవ్ 81 బంతుల్లో 92 పరుగులు చేసి శతకానికి కేవలం ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. అతడి ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నట్లు మ్యాచ్ నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు దులీప్ ట్రోఫీలో అత్యంత చిన్న వయసులో అర్ధశతకం సాధించిన రికార్డు లక్ష్మణ్ సింగ్ పేరిట ఉంది. 1969లో ఆయన 16 ఏళ్ల 23 రోజుల వయసులో ఈ ఘనత సాధించారు. తాజాగా వైభవ్ 15 ఏళ్ల 175 రోజులకే అర్ధశతకం సాధించి ఆ రికార్డును అధిగమించాడు. గత ఏడాది దులీప్ ట్రోఫీలో 16 ఏళ్ల 307 రోజుల వయసులో అర్ధశతకం సాధించిన పియూష్ చావ్లా ఈ జాబితాలో మూడో స్థానానికి వెళ్లాడు. ఈ మ్యాచ్లో వైభవ్ ప్రతిభ బ్యాటింగ్కే పరిమితం కాలేదు. ఈస్ట్ జోన్ రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మణికట్టు గాయంతో మైదానం వీడటంతో వైభవ్కు తాత్కాలికంగా జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే సీనియర్ దేశవాళీ క్రికెట్లో జట్టుకు నాయకత్వం వహించడం అతడి క్రికెట్ ప్రయాణంలో మరో అరుదైన ఘట్టంగా నిలిచింది. కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైభవ్ తన క్రికెట్ పరిణతిని కూడా చూపించాడు. సెంట్రల్ జోన్ బ్యాటర్ ఆర్యన్ జుయాల్ విషయంలో ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ తీసుకున్న డీఆర్ఎస్ నిర్ణయం సఫలమైంది. ఈ నిర్ణయం ద్వారా జుయాల్ వికెట్ను ఈస్ట్ జోన్ ఖాతాలో వేసుకున్నాడు. దులీప్ ట్రోఫీ క్వార్టర్ఫైనల్లో వైభవ్ బ్యాటింగ్లో పెద్దగా రాణించలేకపోయాడు. నార్త్ఈస్ట్ జోన్తో జరిగిన ఆ మ్యాచ్లో కేవలం ఎనిమిది పరుగులకే వెనుదిరిగాడు. అయితే తనకు వచ్చిన బౌలింగ్ అవకాశాన్ని మాత్రం పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఎడమచేతి స్పిన్తో మూడు ఓవర్లు వేసి కేవలం 11 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్లో నాలుగు బంతుల వ్యవధిలోనే రెండు వికెట్లు తీయడం విశేషం. తక్కువ ఓవర్లు మాత్రమే వేసే అవకాశం ఉంటుందని తెలిసినా.. ఒకే చోట బంతిని