గ్రామ పంచాయతీ భవనం, వీవో భవనం, పలు రోడ్లకు మంజూరు ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్ : ప్రజల సమక్షంలో సంక్షేమం, అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలు ఇచ్చామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో ‘పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో భాగంగా మంత్రి పర్యటించారు. దండేపల్లి గ్రామ సర్పంచ్ గులిపల్లి సంపత్ గ్రామంలోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు, బహిరంగ వ్యాయామశాల, అంగన్వాడీ భవనం వంటి అభివృద్ధి పనులు మంజూరయ్యాయని, ఇప్పటివరకు రూ.58 లక్షల విలువైన పనులు జరిగాయని తెలిపారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి స్థలం సిద్ధంగా ఉందని సర్పంచ్ కోరగా, అదే స్థలంలో నూతన భవనాన్ని వెంటనే మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఆరు నెలల్లో భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దండేపల్లి నుంచి దేశాయిపల్లి మీదుగా కమలాపూర్ వెళ్లే రహదారికి రూ.1.20 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. గ్రామంలో పెండింగ్లో ఉన్న అంతర్గత సీసీ రోడ్లను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎల్లమ్మ ఆలయం, పోచమ్మ ఆలయం వైపు రహదారుల అభివృద్ధితో పాటు అంబేద్కర్ వరకు మంజూరైన సీసీ రోడ్డు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కాలువ పనులను కాంట్రాక్టర్తో మాట్లాడి వేగంగా పూర్తి చేయాలని సూచించారు. మంచినీటి బావి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దశాబ్దాల తర్వాత దండేపల్లికి బస్సు సౌకర్యం వచ్చిందని, ఆదివారం కూడా బస్సు నడిచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించుకోవాలని కోరారు. జలసిరి పథకం కింద ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ప్రజలకు సూచించారు. గ్రామాల్లో నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దండేపల్లి గ్రామంలో మూడు మహిళా సంఘాల ఆధ్వర్యంలో 13 రకాల వస్తువులతో 900 స్టీల్ బ్యాంక్ కిట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో హోటల్కు 100 స్టీల్ గ్లాసులు అందించినట్లు చెప్పారు. ఈ నెల 31వ తేదీ వరకు పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బోదకాలు, తలసేమియా, హెచ్ఐవీ బాధితులు తదితర అర్హులైన వారు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి గ్రామాల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 14–15 సంవత్సరాల వయసు గల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణకు టీకాలు వేయించాలని మంత్రి సూచించారు. అంగన్వాడీ కేంద్రాల సేవలను ప్రజ