Kaizer News

యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో ఘనంగా గ్రామ దేవతలకు

యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో ఘనంగా గ్రామ దేవతలకు బోనాలు

· State - Telangana · v6velugu.com

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో ఆదివారం బోనాల ఉత్సవాలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. శ్రావణ మాసంలో భాగంగా మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి, కొండలమ్మ తల్లికి సమర్పించారు. పోతరాజులు, శివసత్తుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా యాదగిరిగుట్ట సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పూజలు.. మాసాయిపేటలో బోనాల పండుగకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, అనిత దంపతులు హాజరయ్యారు. కొండ గుహలో కొలువై ఉన్న కొండలమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మహిమాన్వితం, కోరిన కోరికలను నెరవేర్చే కొంగు బంగారమైన కొండలమ్మ తల్లిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక, దైవచింతన సకల సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని, ప్రతొక్కరూ భక్తిభావం పెంపొందించుకోవాలని సూచించారు

Original source: v6velugu.com
Read more on Kaizer News