నకిరేకల్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి సెప్టెంబరు 5న నకిరేకల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. పర్యటనలో భాగంగా పట్టణంలో కొత్తగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని ప్రారంభించనున్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం మినీ స్టేడియంలో నియోజకవర్గ స్థాయి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రాక నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు