హైదరాబాద్, వెలుగు: అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) పరిధిలోని భూముల్లో ఏండ్ల నుంచి నివాసముంటున్న లక్షలాది మంది సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నిర్దిష్ట పరిమితికి మించి ఉన్న మిగులు స్థలాలను పేదలకు కేటాయించేందుకు గతంలో 1976 నాటి అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములే ఈ ‘యూఎల్సీ’ భూములు. అయితే, దశాబ్దాల క్రితం సీలింగ్ డిక్లరేషన్ సక్రమంగా పూర్తికాకపోవడం, రిజిస్ట్రేషన్లు లేని థర్డ్ పార్టీ కొనుగోళ్ల కారణంగా ప్రస్తుతం వేలాది నివాసాలు, కాలనీలు తీవ్ర గందరగోళంలో చిక్కుకున్నాయి. రిజిస్ట్రేషన్ల చట్టంలోని ‘సెక్షన్ 22-ఏ’ (నిషేధిత జాబితా) పరిధిలోకి ఈ భూములు వెళ్లిపోవడంతో క్రయవిక్రయాలు జరగక, నిర్మాణ అనుమతులు రాక, బ్యాంకు రుణాలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ, సమగ్ర విధానపరమైన నిర్ణయం ద్వారా భూములను క్రమబద్ధీకరించి బాధితులకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని ప్రధాన అర్బన్ అగ్లోమరేషన్ల పరిధిలో భారీ విస్తీర్ణంలో యూఎల్సీ మిగులు భూములు ఉన్నట్టు నిర్ధారణ అయింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి, వరంగల్ అర్బన్ పరిధిలో మొత్తం 879 కేసుల్లో ఏకంగా 87,11,823 చదరపు మీటర్ల (సుమారు 2,152.22 ఎకరాలు) భూమి ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. ఇందులో అత్యధికంగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోనే 640 కేసుల పరిధిలో 50,69,215 చదరపు మీటర్లు (1,252.64 ఎకరాలు) ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 118 కేసుల్లో 28,46,860 చదరపు మీటర్ల (703 ఎకరాలు) విస్తీర్ణం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇక హైదరాబాద్ జిల్లా పరిధిలో 121 కేసులకు సంబంధించి 3,83,586 చదరపు మీటర్లు (94.78 ఎకరాలు), వరంగల్ అర్బన్ పరిధిలో 4,12,160 చదరపు మీటర్ల (101.80 ఎకరాలు) భూమి ఉన్నట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ విస్తీర్ణంలో ఇప్పటికే పెద్దఎత్తున రోడ్లు, మౌలిక వసతులు, నివాస గృహాలు వెలిసి వేలాది కుటుంబాలు నివాసం ఉంటున్నట్టు యంత్రాంగం నివేదించింది. గతంలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల (జీవోల) ద్వారా యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టినప్పటికీ, వేల సంఖ్యలో దరఖాస్తులు ఇంకా పరిష్కారం కాకుండా పెండింగ్లోనే మిగిలిపోయాయి. రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాల్లో జీవో ఎంఎస్ నం.455, 456, 747 కింద మొత్తం 11,388 దరఖాస్తులు రాగా, అందులో 5,809 పరిష్కారమయ్యాయి. ఇంకా 5,579 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటి ద్వారా ఇప్పటికే రూ.405.32 కోట్లు వసూలు కాగా, పెండింగ్ దరఖాస్తుల ద్వారా మరో రూ.71.17 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. అలాగే, హైదరాబాద్ జిల్లాలో మొత్తం 5,263 దరఖాస్తులకుగానూ 4,927 పరిష్కారమై, 336 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, ప్రభుత్వం రూ.61.61 కోట్ల రెవెన్యూ సాధించింది. మరోవైపు ఖాళీ యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణ నిమిత్తం తెచ్చిన జీవో నం.92 కింద 7,867 దరఖాస్తులు అందగా, 1,247 దరఖాస్తుదారులకు 3.16 లక్షల చదరపు గజాల విస్తీ