Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో నెలకొన్న ఆవర్తనం శనివారం నాటికి అల్పపీడనంగా మారనుండటంతో చెదురుమదురుగా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి. తెలంగాణ వ్యాప్తంగా శనివారం రోజంతా ఆకాశం ఎక్కువగా మేఘావృతమై ఉండే అవకాశాలు ఉన్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ పరిధిలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షపాతం నమోదు కావచ్చని అధికారులు తెలిపారు. ఈ సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, బహిరంగ ప్రదేశాల్లో సంచరించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాజధాని హైదరాబాద్ నగరంలో వాతావరణం రోజంతా ఆహ్లాదకరంగా మారనుంది. ఉదయం నుంచి ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి, మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే వీలుంది. వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 31 డిగ్రీల నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య, కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీల నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మార్పుల వల్ల ఎండ వేడి నుంచి నగరవాసులకు ఉపశమనం లభించనుంది. వాయవ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడనున్న అల్పపీడన ప్రభావం కోస్తాంధ్రపై స్పష్టంగా పడనుంది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర తీరప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో కెరటాల ఉద్ధృతి ఎక్కువగా సూచనలు ఉన్నాయి. కోస్తాంధ్రతో పోలిస్తే రాయలసీమ జిల్లాల్లో భిన్నమైన పరిస్థితులు నెలకొననున్నాయి. అక్కడ ఆకాశం పొడిగా లేదా పాక్షికంగా మేఘావృతమై ఉంటూ ఒకటి రెండు చోట్ల మాత్రమే చిన్నపాటి జల్లులు పడవచ్చు. సాధారణం కంటే ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉనందున ఉక్కపోత వేధించవచ్చు. వర్షాలు, పిడుగుల తీవ్రత దృష్ట్యా ప్రయాణాలు పెట్టుకునే వారు స్థానిక సమాచారాన్ని పరిశీలించుకోవాలని అధికారులు కోరారు. పిడుగులు పడే సమయంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు. 2014లో జర్నలిస్ట్గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్సైట్లలో కంటెంట్ రైటర్గా పని చేశాను. డిజిటల్ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్కు సంబంధించిన కంటెంట్ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది