Atreyapuram: రాజమహేంద్రవరం ఏసీబీ రేంజ్ పరిధిలోని ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో ₹16,500 లంచం తీసుకుంటూ వీఆర్వో నిందితుడిగా ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.ర్యాలి గ్రామ వీఆర్వో నాగేశ్వరరావు, ఫిర్యాదుదారు చిన్నం లక్ష్మీ ప్రసన్నకు సంబంధించిన సర్వే నంబర్ 381/6లో 0.09 ఎకరాల భూమి మ్యుటేషన్ దరఖాస్తును ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేసేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఈ మేరకు శనివారం సాయంత్రం సుమారు 4.50 గంటలకు ₹16,500 లంచం స్వీకరించి తన ఎడమవైపు షర్ట్ జేబులో ఉంచుకున్న సమయంలో ఏసీబీ అధికారులు ర్యాలి గ్రామ సచివాలయంలో పట్టుకున్నారు. ఈ నిందితుడి షర్ట్ జేబులో నుంచి లంచం మొత్తాన్ని పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి చేతులకు నిర్వహించిన రసాయన పరీక్షలో కుడి చేతికి పాజిటివ్ ఫలితం వచ్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సంబంధిత మ్యుటేషన్ దరఖాస్తు ఫైలును కూడా నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.కేసు దర్యాప్తు, తదుపరి ట్రాప్ అనంతర చర్యలు కొనసాగుతున్నాయి.ఈ కార్యక్రమంలో ఎస్పీ,ఏసీబీ రాజమహేంద్రవరం రేంజ్ అధికారులు పాల్గొన్నారు