ఓటర్ల వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలి: ఎంపీడీవో భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా తయారీలో భాగంగా వివరాలు సక్రమంగా నమోదు కాని ఓటర్లకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో భీమ్గల్ మండలం బెజ్జోరా గ్రామంలో శనివారం గ్రామసభ నిర్వహించారు. నోటీసులు అందుకున్న వారి నుంచి అవసరమైన వివరాలను సేకరించి, ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో బూత్ స్థాయి అధికారులు నమోదు చేస్తున్న ప్రక్రియను ఎంపీడీవో జి. సంతోష్కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు. ఓటర్ల జాబితాలో వివరాలు సక్రమంగా నమోదు కాని వారి నుంచి వివరాల సేకరణ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు జాబితాలో సక్రమంగా నమోదయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు సహకరించాలని ఎంపీడీవో కోరారు. ఓటర్ల నుంచి సేకరించే వివరాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించి నమోదు చేయాలని సూచించారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు వివరాలు కూడా జాబితాలో నమోదు కాకుండా మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కార్తిక్, ఉప సర్పంచ్ మూడేళ్ల బాలయ్య, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, జీపీఓ, బూత్ స్థాయి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు