భవానిపురం, ఆంధ్రప్రభ : రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ బుద్ధా వెంకన్న అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ కుమ్మరపాలెం సెంటర్ ప్రాంతంలో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో బుద్ధా వెంకన్న పాల్గొని ప్రజలను కలిశారు. ప్రతి ఇంటికీ వెళ్లి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాటలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కృషి చేస్తున్నారని బుద్ధా వెంకన్న అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కారం చూపడమే తమ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. 38వ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకమై పనిచేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షుడు సురభి బాలు, పితాని పద్మ, కె. శివ, ఈగల సాంబా, సత్యం, ఎస్కె. యూసబ్, రంగా దుర్గా, జాహిద్, చెంచయ్య, ఎస్కె. జాహిర్, ఏ. చలపతి, కె. సాంబా తదితరులు పాల్గొన్నారు