అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని పెన్షన్దారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.2,693.90 కోట్లను విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లను లబ్ధిదారులకు అందించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సెప్టెంబర్ నెలలో మొత్తం 61,92,396 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్లు అందించే విధానాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోందని పేర్కొన్నారు. భర్తను కోల్పోయిన అర్హులైన జీవిత భాగస్వాములకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో కొత్తగా 6,268 మంది లబ్ధిదారులకు స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. వీరికి సెప్టెంబర్ 1న పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం రూ.2.51 కోట్లు విడుదల చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు పెన్షన్ల కోసం రూ.73,506 కోట్లు ఖర్చు చేసినట్లు కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ప్రతినెలా నిర్ణీత సమయానికి లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు