జైనూర్, ఆంధ్రప్రభ: శ్రీశ్రీశ్రీ సద్గురు పరమహంస పూలాజీ బాబా అందించిన ఆధ్యాత్మిక సేవలు ప్రశంసనీయమని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ అన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్లోని సిద్ధేశ్వర సంస్థాన్లో ఆదివారం నిర్వహించిన సద్గురు పూలాజీ బాబా 97వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులతో కలిసి బాబా సమాధి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రితీష్ రాథోడ్ మాట్లాడుతూ పూలాజీ బాబా తన ఆధ్యాత్మిక ధ్యాన, ప్రవచనాల ద్వారా వేలాది కుటుంబాల్లో ఆధ్యాత్మిక మార్పునకు బాటలు వేశారని అన్నారు. ఆయన చూపిన ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ అనేక కుటుంబాలు సన్మార్గంలో నడుస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ ఉట్నూర్ మండల అధ్యక్షుడు బింగి వెంకటేష్, మాజీ ఎంపీటీసీ సాల్గేరి రవీందర్, నాయకుడు పులి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు