జగిత్యాల: మద్దూనూరు నుండి జగిత్యాలకు దాదాపు 100 మంది ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సులో డ్రైవర్ లక్ష్మణ్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో తీవ్ర ప్రమాదం తప్పింది. ప్రయాణంలో ఉండగానే లక్ష్మణ్కు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. గుండెల్లో తీవ్రమైన నొప్పి వస్తున్నప్పటికీ, అప్రమత్తమై బస్సును నెమ్మదిగా రోడ్డు పక్కకు నిలిపివేశారు. ఆ వెంటనే ఆయన స్టీరింగ్పైనే స్పృహతప్పి పడిపోయారు. సమయానికి డ్రైవర్ బస్సును వేగం తగ్గించి నిలపడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం తృటిలో తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. * 108 నిర్లక్ష్యం: ప్రమాదం జరిగిన వెంటనే 108 అత్యవసర వాహనానికి ఫోన్ చేసినా సకాలంలో స్పందించలేదని ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సమయం వృథా చేయకుండా ఆటోలో డ్రైవర్ లక్ష్మణ్ను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. * డిపో అధికారుల తీరుపై మండిపాటు: సోమవారంతో పదవీ విరమణ (రిటైర్మెంట్) పొందాల్సిన లక్ష్మణ్, తన ఆరోగ్యం సహకరించడం లేదని మొరపెట్టుకున్నప్పటికీ అధికారులు వినకుండా డ్యూటీ వేశారని కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం డ్రైవర్ లక్ష్మణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ప్రయాణికులు ఆయన త్వరితగతిన కోలుకోవాలని కోరుకుంటున్నారు