తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు ముఖ్యమంత్రి రేవంత్ లేఖ రాశారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా పెద్ద సంఖ్యలో ఓట్ల తొలగింపుపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 92.86 లక్షల ఓట్ల తొలగింపుకు సంబంధించిన సమగ్ర పరిశీలన అవసరమని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్ల నుంచి క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరించేందుకు ప్రస్తుతం ఉన్న గడువు సరిపోదని... గడువును మరో నాలుగు వారాల పాటు పొడిగించాలని కోరారు. సీఈసీకి రాసిన లేఖలో సీఎం రేవంత్ కీలక అంశాలను ప్రస్తావించారు. ఓటు హక్కును కాపాడుతూ, అర్హులైన ప్రతి పౌరుడు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ఆయన కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో 73.39 లక్షల నమోదులను గైర్హాజరు, శాశ్వతంగా తరలిపోయినవారు, మరణించినవారు, నకిలీ నమోదుల విభాగాల్లో గుర్తించినట్లు పేర్కొన్నారు. వీటిలో 45.19 లక్షల మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినవారిగా గుర్తించినట్లు తెలిపారు. అయితే, ఈ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల హక్కుకు ఎలాంటి భంగం కలగకూడదని స్పష్టం చేశారు. క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేసుకునే గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలని సీఎం కోరారు. ముసాయిదా ఓటర్ల జాబితాలను గ్రామసభలు, వార్డు కమిటీ సమావేశాల్లో బహిరంగంగా చదివి వినిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సంచలన సర్వే: తెలంగాణలో ఆ పార్టీ సీన్ రివర్స్, ఇక వారిదే హవా- ఎవరికి ఎన్ని సీట్లు..!! లేఖలో కీలక అంశాల ప్రస్తావన అదే విధంగా నోటీసులు అందుకున్న ఓటర్లు స్పందించేందుకు మూడు నుంచి నాలుగు వారాల సమయం ఇవ్వాలని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లకు అవసరమైన సమాచారం, సహాయం అందించేందుకు ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. ఓటరు నమోదు లేదా ధృవీకరణ కోసం అంగీకరించే పత్రాల జాబితాను స్పష్టంగా ప్రకటించాలని సూచించారు. అవసరానికి అనుగుణంగా ఓటరు నమోదు అధికారుల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. "ఒక్క అర్హుడైన ఓటరు కూడా ఓటర్ల జాబితా నుంచి తప్పిపోకూడదు" అన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఓటరు హక్కు పరిరక్షణ కోసం ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా పారదర్శకంగా, సమగ్రంగా ఓటరు జాబితా సవరణ చేపట్టాలని కోరారు