తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి గోల్ఫ్ కోర్సులు.. షామీర్పేట సమీపంలోని జవహర్నగర్లో 130 ఎకరాల్లో గోల్ఫ్ కోర్సు.. కృష్ణా తీరం సోమశిలలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్, ఆంధ్రప్రభ: క్రీడా పర్యాటకాన్ని మరింత విస్తరించి తెలంగాణను అంతర్జాతీయ స్థాయి గోల్ఫ్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. షామీర్పేట సమీపంలోని జవహర్నగర్లో 130 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక గోల్ఫ్ కోర్సు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని వెల్లడించారు. అలాగే కృష్ణా నది తీరంలోని సోమశిలలో మరో అంతర్జాతీయ ప్రమాణాల గోల్ఫ్ కోర్సు అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్లోని గోల్కొండ గోల్ఫ్ క్లబ్లో నిర్వహించిన 12వ తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ పోటీలు సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. క్రీడ, ప్రకృతి, పర్యాటకాన్ని సమన్వయం చేస్తూ తెలంగాణకు కొత్త పర్యాటక అవకాశాలు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కృష్ణా నది తీరంలో, నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంగా ఉన్న సోమశిల సహజసిద్ధమైన అందాలతో ప్రత్యేకతను సంతరించుకుందని జూపల్లి అన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్కు సమీపంలో ఉండటం వల్ల అక్కడ గోల్ఫ్తో పాటు ప్రకృతి పర్యాటకాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉందని తెలిపారు. క్రీడా పర్యాటకానికి సోమశిలను ప్రత్యేక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ కేవలం క్రీడా పోటీ మాత్రమే కాదని, రాష్ట్ర చారిత్రక వారసత్వం, పర్యాటక సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసే వేదిక అని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్కే కాకుండా రాష్ట్రంలోని సరస్సులు, అడవులు, నదులు, కోటలు, రాజభవనాలు వంటి పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. గోల్కొండ కోట నేపథ్యంలో జరిగే ఈ టోర్నీ తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. దేశ, విదేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనడం ద్వారా తెలంగాణ పర్యాటక రంగానికి మరింత ప్రచారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. క్రీడా, పర్యాటక ప్రోత్సాహానికి కపిల్ దేవ్ సేవలు తెలంగాణలో పర్యాటక, క్రీడా రంగాల అభివృద్ధికి మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్ అనుభవం, సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు జూపల్లి తెలిపారు. ఆయన భాగస్వామ్యం ద్వారా తెలంగాణ పర్యాటక విశేషాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తృతంగా ప్రచారం పొందుతాయని అన్నారు. కపిల్ దేవ్ మాట్లాడుతూ తెలంగాణ గోల్కొండ మాస్టర్స్కు తెలంగాణ పర్యాటక శాఖ అందిస్తున్న సహకారాన్ని అభినందించారు. ఈ పోటీలు హైదరాబాద్, తెలంగాణను ప్రముఖ గోల్ఫ్ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ నిర్వహించనున్నారు. మొత్తం 132 మంది గోల్ఫర్లు రూ.కోటి బహుమతి కోసం