Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 సెమీఫైనల్లో ఒక అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) వేదికగా ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్ మధ్య జరుగుతున్న పోరులో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయపడ్డాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో వికెట్ కీపింగ్ చేస్తుండగా బంతి కుడి చేయి మణికట్టుకు తాకడంతో ఇషాన్ నొప్పితో మైదానాన్ని వీడాడు. మైదానంలో ఫిజియోలు చికిత్స అందించినప్పటికీ నొప్పులు తగ్గకపోవడంతో అతను హ్యాండ్ స్ట్రాప్తో డగౌట్కే పరిమితమయ్యాడు. అతని స్థానంలో కుమార్ కుషాగ్రా వికెట్ కీపింగ్ బాధ్యతలు స్వీకరించగా, జట్టు వైస్ కెప్టెన్గా ఉన్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈస్ట్ జోన్కు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. ఏదైనా ప్రొఫెషనల్ క్రికెట్లో 15 ఏళ్ల చిన్న వయసులోనే ఒక జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడం వైభవ్ సూర్యవంశీకి ఇదే తొలిసారి. దులీప్ ట్రోఫీ ఆరంభానికి ముందే అతడిని ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేసినప్పటికీ, సెలెక్టర్లు అతనిలోని నాయకత్వ లక్షణాలపై ఉంచిన నమ్మకం నిజమైంది. నార్త్ ఈస్ట్ జోన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో బ్యాట్తో కేవలం 8 పరుగులే చేసినప్పటికీ, బౌలింగ్లో మాత్రం ఒకే ఓవర్లో రెండు వికెట్లు (కిషన్ లింగ్డో, ఇమ్లివాతి లెమ్తుర్) తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున మెరిసిన వైభవ్, ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ అంతర్జాతీయ టీ20 జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఆపై జరిగిన జింబాబ్వే టూర్లో విజృంభించి, 3 మ్యాచ్ల్లో రెండు అర్ధసెంచరీలతో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కైవసం చేసుకున్నాడు. కాగా, మణికట్టు గాయంతో ఇబ్బందిపడుతున్న ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్లో మళ్లీ బ్యాటింగ్కు వస్తాడా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ ఇషాన్ బ్యాటింగ్కు దూరమైతే అది ఈస్ట్ జోన్ జట్టుకు భారీ ఎదురుదెబ్బగానే భావించవచ్చు