విశాఖ, మధురవాడ: రాష్ట్ర ఐటీ, విద్య, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం విశాఖ జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. 2,000 కోట్లతో ఏఐజీ ఆసుపత్రి. మధురవాడ పనోరమ హిల్స్ నుండి - ఎండాడ మార్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఏఐజీ ఆసుపత్రికి మంత్రి శంకుస్థాపన చేస్తారు. 1,000 పడకలు,50కి పైగా ప్రత్యేక వైద్య విభాగాలతో రూ.2 వేల కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 9,000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. రోశయ్య విగ్రహావిష్కరణ. పోర్టు గెస్ట్ హౌస్ సమీపంలో (వాల్తేర్ క్లబ్ గేటు ఎదురుగా) ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి దివంగత కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. కళాశాల,సేవా భవనాల ప్రారంభం.. గంభీరం ఐఐఎం సమీపంలో ప్రేమ గ్రూప్ ఇన్ స్టిట్యూషన్స్ నూతన కళాశాల భవనంతో పాటు ఏజ్ కేర్ ఫౌండేషన్ నూతన భవనాలను ప్రారంభిస్తారు. ఉదయం భోగాపురం విమానాశ్రయం చేరుకునే మంత్రి, రోజంతా వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం విజయవాడ తిరుగు ప్రయాణమవుతారు