Khanapur: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో పోలీసులు కార్డన్ అండ్ సేర్చ్ . పాత ఎల్లాపూర్ గ్రామంలో నిర్మల్ డీఎస్పీ నేతృత్వంలో తెల్లవారుజాము నుంచే పోలీసులు భారీగా రంగంలోకి దిగారు. గ్రామంలోని ప్రతి ఇల్లాన్ని, అనుమానాస్పద ప్రాంతాలను జల్లెడ పట్టారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 60 ద్విచక్ర వాహనాలతో పాటు 8 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. వాహనదారులు తప్పనిసరిగా ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలను కలిగి ఉండాలని.. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు తనిఖీల అనంతరం గ్రామస్తులు, యువతతో పోలీసులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రస్తుత సమాజంలో యువతను పట్టి పీడిస్తున్న సైబర్ నేరాలు, గంజాయి మహమ్మారిపై డీఎస్పీ అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో వచ్చే నకిలీ లింకులను క్లిక్ చేయవద్దని, సైబర్ కేటుగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు. అలాగే గంజాయి లాంటి వ్యసనాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును పాడుచేసుకోవద్దని యువతకు హితవు పలికారు. గ్రామంలో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు