తాడ్వాయి, ఆంధ్రప్రభ: తాడ్వాయి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో అధికారులు, సిబ్బంది భయాందోళనల మధ్య విధులు నిర్వహిస్తున్నారు. ఏళ్ల క్రితం నిర్మించిన కార్యాలయ భవనం ప్రస్తుతం పలు చోట్ల పగుళ్లతో ప్రమాదకరంగా మారింది. భవనం పైకప్పు నుంచి స్లాబ్ పెచ్చులు రాలిపడుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. వర్షం కురిసినప్పుడు భవనంలోకి నీరు చేరడంతో విద్యుత్ సమస్యలు తలెత్తుతాయేమోనని భయపడుతున్నారు. కార్యాలయానికి రావాలంటేనే భయంగా ఉందని కొందరు సిబ్బంది, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందలాది మంది ప్రజలు వచ్చే అభివృద్ధి కార్యాలయం ఇలాంటి దుస్థితిలో ఉండటం ఆందోళనకరమని స్థానికులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి కొత్త ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు