అగ్ని ప్రమాదంలో నిరాశ్రయురాలైన మహిళకు నిత్యావసర వస్తువులు, ఆర్థిక సాయం కోడూరు, ఆంధ్రప్రభ : విశ్వనాథపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి నిరాశ్రయురాలైన బత్తుల కోటమ్మకు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ కోడూరు మండల శాఖ ఆధ్వర్యంలో చేయూత అందించారు. ఆదివారం బాధితురాలిని పరామర్శించిన రెడ్క్రాస్ ప్రతినిధులు, కృష్ణాజిల్లా రెడ్క్రాస్ సొసైటీ అందించిన వంట సామగ్రి, తార్పాలిన్ పట్టాను అందజేశారు. శ్రీ కనకదుర్గ రైస్మిల్ ప్రొప్రైటర్ తోట శేషగిరిరావు సహకారంతో 25 కిలోల బీపీటీ బియ్యం అందించారు. మండల శాఖ చైర్మన్ సహకారంతో నిత్యావసర సరుకులు, కూరగాయలు, నూతన వస్త్రాలు అందజేశారు. స్థానిక నాయకుడు తోట రాంబాబు సహకారంతో బాధితురాలికి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి తమవంతు సహాయం అందించామని రెడ్క్రాస్ ప్రతినిధులు తెలిపారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు ముందుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ చైర్మన్ జరుగు పోతురాజు, వైస్ చైర్మన్ తోట శ్రీనివాసరావు, కోశాధికారి కొండవీటి సురేష్, శాఖ సభ్యులు వెజండ్ల శ్రీనివాసరావు, గోనా వేణు, రేపల్లె యోగ ప్రకాష్, కోట మహిధర్, మోపిదేవి స్వరూప్, పిల్లి వెంకటేశ్వరరావు, జరుగు లక్ష్మణ్, స్థానిక నాయకులు తండు గంగాధర్, తోట లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు