భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలం పిప్రి (జె) గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులకు సోమవారం కాంగ్రెస్ నాయకులు ముగ్గు పోసి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలోచన మేరకు ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రతి గ్రామాన్ని గుడిసెలు లేని గ్రామంగా మార్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇళ్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సర్పంచ్ అరిగెల జనార్దన్ తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రంజిత్ జేమ్స్, పార్టీ అధ్యక్షుడు రాజేష్, పంచాయతీ కార్యదర్శి జితేందర్, కాంగ్రెస్ నాయకులు దుర్గి రాజేందర్గౌడ్, కోమనపల్లి గంగారం, రంజిత్ ప్రసాద్, మోహన్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు