హైదరాబాద్, వెలుగు: జపాన్లోని ప్రముఖ పారిశ్రామిక నగరం కిటాక్యూషుతో పారిశ్రామిక, సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కీలక భాగస్వామ్యానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర శక్తి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నేతృత్వంలోని ప్రతినిధి బృందం జపాన్ పర్యటనలో భాగంగా కిటాక్యూషు డిప్యూటీ మేయర్ చికాకో ఓబాతో సమావేశమై విస్తృతంగా చర్చించింది. హైదరాబాద్లోని స్టార్టప్, ఐటీ ఇన్నోవేషన్ వ్యవస్థను కిటాక్యూషు పారిశ్రామిక బలంతో అనుసంధానించేలా ‘కిటాక్యూషు–తెలంగాణ టెక్నాలజీ బ్రిడ్జి’ని ఏర్పాటు చేయాలని మంత్రి ప్రతిపాదించారు. అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్, ఏఐ, రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, సెమీకండక్టర్స్, పర్యావరణహిత గ్రీన్ టెక్నాలజీ రంగాల్లో పరస్పర సహకారం అవసరమని స్పష్టం చేశారు. ఒకప్పుడు భారీ పరిశ్రమల కేంద్రంగా ఉండి, నేడు గ్రీన్ గ్రోత్, పర్యావరణ సాంకేతికతల్లో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన కిటాక్యూషు పురోగతి తెలంగాణకు ఎంతగానో స్ఫూర్తిదాయకమని మంత్రి పేర్కొన్నారు. జపాన్ కంపెనీల్లో పెరుగుతున్న మానవ వనరుల కొరతను తీర్చేందుకు తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన నిపుణులను అందించేందుకు పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తామని మంత్రి వివేక్ తెలిపారు. ఇందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కామ్)ను ప్రధాన సంస్థాగత వేదికగా వినియోగిస్తామని చెప్పారు. కిటాక్యూషు కంపెనీల నుంచి ఉద్యోగాల అవసరాలు, విద్యార్హతల వివరాలు సేకరించి.. అభ్యర్థుల ఎంపిక, సర్టిఫికెట్ల పరిశీలన, జపనీస్ భాషా నైపుణ్యాలు, అక్కడి పని సంస్కృతి (వర్క్ కల్చర్), భద్రతా ప్రమాణాలపై టామ్కామ్ ద్వారా ముందస్తు శిక్షణ ఇప్పిస్తామని వివరించారు. కిటాక్యూషు పారిశ్రామిక బలాన్ని, తెలంగాణ యువత నైపుణ్యశక్తిని అనుసంధానించడం ద్వారా జపాన్ పరిశ్రమల అవసరాలు తీరడమే కాకుండా, మన యువతకు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఉద్యోగావకాశాలు దక్కుతాయన్నారు. జపాన్ పరిశ్రమల ప్రమాణాలకు తగ్గట్టుగా రాష్ట్రంలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ) ద్వారా యువతకు హైటెక్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు మంత్రి వివేక్ తెలిపారు. అధునాతన సీఎన్సీ మెషినింగ్, పారిశ్రామిక రోబోటిక్స్, డిజిటల్ మాన్యుఫాక్చరింగ్, తయారీ ప్రక్రియల నియంత్రణ, ఆటోమేషన్, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) నిర్వహణలాంటి కీలక రంగాల్లో శిక్షణ ఇచ్చి, ప్రాక్టికల్ పరీక్షల అనంతరం ఉద్యోగాలకు సిద్ధం చేస్తామన్నారు. పర్యటనలో భాగంగా కిటాక్యూషు చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు జుంజీ సుడా, సెక్రటరీ జనరల్ యసుహారు హొట్టాతో మంత్రి బృందం భేటీ అయింది. కిటాక్యూషు చాంబర్ పరిధిలోని కంపెనీలు, చిన్న-మధ్యతరహా పరిశ్రమలను (ఎస్ఎంఈ) తెలంగాణ పారిశ్రామిక వ్యవస్థతో అనుసంధానించాలని చర్చించారు. చాంబర్ ప్రతినిధులు హైదరాబాద్కు వచ్చి స్థానిక కంపెనీలు, పారిశ్రామిక పార్కులను ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆహ్వానించారు. ప్రభుత్వాల మధ్య చర్చలు ప్రాథమిక వాతావరణాన్ని కల్పిస్తే, కంపెనీల మధ్య కుదిరే ప్రత్యక్