హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ క్రికెటర్ గా మైదానంలో అదరగొట్టారు. హెచ్సీఏ సి-డివిజన్ వన్డే లీగ్ క్రికెట్ ఛాంపియన్షిప్లో సికింద్రాబాద్ క్లబ్ తరఫున బరిలోకి దిగిన ఆయన అద్భుతమైన సెంచరీతో మెరిశారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్తో జరిగిన మ్యాచ్లో సీవీ ఆనంద్ కేవలం 82 బంతుల్లో 126 పరుగులతో అజేయంగా నిలిచారు. తన ఇన్నింగ్స్లో రెండు ఫోర్లు, ఐదు భారీ సిక్సర్లు బాదారు. మరోవైపు జంషీద్ హోర్ముజ్జీ 77 పరుగులు, సంజీవ్ రెడ్డి 40 పరుగులతో రాణించడంతో సికింద్రాబాద్ క్లబ్ నిర్ణీత 39 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ జట్టు 21.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. అనంతరం మ్యాచ్ పరిస్థితుల నేపథ్యంలో వీజేడీ పద్ధతి ప్రకారం ఫలితాన్ని నిర్ణయించగా సికింద్రాబాద్ క్లబ్ విజేతగా నిలిచింది. బ్యాటింగ్లో సెంచరీతో మెరిసిన సీవీ ఆనంద్ బౌలింగ్లోనూ తన వంతు పాత్ర పోషించారు. ఐదు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశారు. వికెట్ దక్కకపోయినా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి జట్టు విజయానికి సహకరించారు