Kurnool: యువత మేలుకో ఓటరుగా నమోదు చేసుకో.. అనే పిలుపు మేరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఈఆర్వో, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న ‘స్పెషల్ క్యాంపెయిన్ డే’ కార్యక్రమాన్ని శనివారం ఏ.క్యాంపులోని ఇందిరాగాంధీ మెమోరియల్ స్కూల్లో ఈఆర్వో, పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓటర్ల నమోదు, అభ్యంతరాలు, వివరాల సవరణ ప్రక్రియను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈఆర్వో మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఓటర్ల జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకునేందుకు ఫారం-6, అనర్హులైన లేదా మరణించిన, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలివెళ్లిన వారి పేర్లపై అభ్యంతరం లేదా తొలగింపు కోసం ఫారం-7, ఓటర్ల జాబితాలో పేరు, చిరునామా తదితర వివరాల్లో మార్పులు, సవరణలు చేసుకునేందుకు ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎస్ఐఆర్ డ్రాఫ్ట్లో ఓటు లేని వాళ్ళు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆదివారం నిర్వహించే ‘స్పెషల్ క్యాంపెయిన్ డే’లో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉంటారని, అర్హత ఉన్న యువతతో పాటు ఓటర్ల జాబితాలో తమ పేర్లు, వివరాలను పరిశీలించుకోవాల్సిందిగా సూచించారు. 18 ఏళ్లు పూర్తయిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు, ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలని, అవసరమైన సవరణలు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు కోరారు